ఆమోసు 
గ్రంథకర్త 
1:1 ప్రకారం దీని రచయిత ఆమోసు ప్రవక్త. ఇతడు తెకోవ అనే ఊరిలో కొందరు కాపరులు మధ్య నివసించాడు. తన రచనలో అతడు తాను ప్రవక్తల కుటుంబం వాడు కాడని స్పస్టం చేశాడు. తనను తాను ఒక ప్రవక్తగా అతడు ఎంచుకోలేదు. దేవుడు విడుదల ద్వారా తీర్పు పంపుతాడని హెచ్చరించాడు. అయితే ఆమోసు ప్రార్దన ఇశ్రాయేలు కాపాడింది. 
రచనా కాలం, ప్రదేశం 
సుమారు క్రీ. పూ. 760 - 740 
ఆమోసు బేతేలు, సమరయ ప్రాంతాల్లో ప్రవచించాడు. ఇవి ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యంలో ఉన్నాయి. 
స్వీకర్త 
ఇశ్రాయేలు ఉత్తర రాజ్య ప్రజానీకం. భావికాలంలో బైబిలు చదవ నున్న వారంతా. 
ప్రయోజనం 
అహంకారం అంటే దేవునికి గిట్టదు. తమకు ఎవరి తోడు అక్కర లేదని ప్రజలు అనుకొని విర్రవీగుతున్నారు. అన్నీ దేవుని నుండే వస్తాయని వారు మర్చిపోయారు. దేవునికి మనుషులంతా ఇష్టమే. పేదలను పీడించే వారిని ఆయన హెచ్చరిస్తున్నాడు. చివరగా దేవుడు యధార్దమైన ఆరాధన కోరుతున్నాడు. అంతేగాక తనకు గౌరవించే ప్రవర్తన కోరుతున్నాడు. ఆమోసు ద్వారా దేవుని సందేశం ఇశ్రాయేలు సంపన్నుల కోసం వస్తున్నది. వీరికి తమ సాటి మనుషులంటే ప్రేమ లేదు. ఇతరుల బలహీనతను ఆసరాగా తీసుకొని వారిని దోచుకుంటారు. వారు తమ స్వార్థమే ఆలోచిస్తుంటారు. 
ముఖ్యాంశం 
తీర్పు 
విభాగాలు 
1. జాతుల వినాశనం — 1:1-2:16 
2. ప్రవక్తగా పిలుపు — 3:1-8 
3. ఇశ్రాయేల్ పై తీర్పు — 3:9-9:10 
4. పూర్వక్షేమస్ధితి — 9:11-15  
 1
 1 ఇశ్రాయేలీయులను గురించి తెకోవలోని గొర్రెల కాపరి ఆమోసు చూసిన దర్శనంలోని విషయాలివి. యూదారాజు ఉజ్జియా రోజుల్లో ఇశ్రాయేలు రాజు యెహోయాషు కొడుకు యరొబాము రోజుల్లో భూకంపం రావడానికి రెండేళ్ళు ముందు, అతడు ఈ దర్శనం చూశాడు.  2 అతడు ఇలా చెప్పాడు, 
“యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు. 
యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు. 
కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి. 
కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.” 
జాతుల పై తీర్పు 
 3 యెహోవా చెప్పేదేమిటంటే, 
“దమస్కు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, 
నేను తప్పకుండాా దాన్ని శిక్షిస్తాను. 
ఎందుకంటే వాళ్ళు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చారు. 
 4 నేను హజాయేలు ఇంటి మీదకి అగ్ని పంపిస్తాను. అది బెన్హదదు రాజ భవనాలను దహించి వేస్తుంది. 
 5 దమస్కు ద్వారాల అడ్డగడియలను విరగగొడతాను. 
బికత్ ఆవెనులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను. 
బెత్ ఏదేనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను. 
ఆరాము ప్రజలు బందీలుగా కీరు ప్రాంతానికి వెళ్తారు.” 
అని యెహోవా చెబుతున్నాడు. 
 6 యెహోవా చెప్పేదేమిటంటే, 
“గాజా మూడుసార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, 
నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. 
ఎందుకంటే వారు చాలామందిని బందీలుగా తీసుకుపోయి ఎదోము వారి వశం చేశారు. 
 7 గాజా ప్రాకారాల మీద నేను అగ్ని పంపిస్తాను. 
అది వారి రాజ భవనాలను దహించి వేస్తుంది. 
 8 అష్డోదులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను. 
అష్కెలోనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను. 
ఎక్రోనుకు విరోధంగా నా చెయ్యి ఎత్తుతాను. 
ఇంకా మిగిలిన ఫిలిష్తీయులు నాశనమవుతారు” అని యెహోవా ప్రభువు చెబుతున్నాడు. 
 9 యెహోవా చెప్పేదేమిటంటే, 
“తూరు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. 
ఎందుకంటే వాళ్ళు ప్రజా సమూహాలన్నిటినీ ఎదోముకు అప్పగించారు. 
వాళ్ళు సోదర భావంతో చేసుకున్న నిబంధనను తెగతెంపులు చేసుకున్నారు. 
 10 నేను తూరు ప్రాకారాల మీదికి అగ్ని పంపిస్తాను. 
అది దాని రాజ భవనాలను దహించి వేస్తుంది.” 
 11 యెహోవా చెప్పేదేమిటంటే, 
“ఎదోము మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, 
నేను తప్పకుండా అతన్ని శిక్షిస్తాను. 
ఎందుకంటే వాడు జాలి చూపకుండా కత్తి పట్టుకుని తన సోదరులను తరిమాడు. 
అతని కోపం ఎప్పుడూ రగులుతూనే ఉంది. 
అతని ఆగ్రహం ఎప్పటికీ నిలిచే ఉంది. 
 12 తేమాను మీదికి నేను అగ్ని పంపిస్తాను. అది బొస్రా రాజ భవనాలను తగలబెడుతుంది.” 
 13 యెహోవా చెప్పేదేమిటంటే, 
“అమ్మోనీయులు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. 
ఎందుకంటే తమ సరిహద్దులను ఇంకా విశాలం చేసుకోవాలని వారు గిలాదులోని గర్భవతుల కడుపులు చీల్చారు. 
 14 రబ్బా ప్రాకారాలను కాల్చేస్తాను. 
యుద్ధ ధ్వనులతో, సుడి గాలి వీచేటప్పుడు కలిగే ప్రళయం లాగా అది రాజ భవనాలను దహించివేస్తుంది. 
 15 వారి రాజు, అతని అధిపతులందరూ బందీలుగా దేశాంతరం పోతారు” అని యెహోవా చెబుతున్నాడు.