౧౦
 ౧ యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.  ౨  “రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి. 
 ౩ సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి.  ౪ యాజకులు ఒకే బాకా ఊదితే ఇశ్రాయేలు సమాజంలో నాయకులూ, తెగల పెద్దలు నీ దగ్గరకి రావాలి.  ౫ మీరు పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి తూర్పు వైపున ఉన్న సేనలు ప్రయాణం ప్రారంభించాలి. 
 ౬ మీరు రెండో సారి పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి దక్షిణం వైపున సైన్యాలు ప్రయాణం మొదలు పెట్టాలి. వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు పెద్ద శబ్దంతో ఊదాలి.  ౭ సమాజం సమావేశంగా కూడినప్పుడు బాకాలు ఊదాలి గానీ పెద్ద శబ్దం చేయకూడదు.  ౮ యాజకులైన అహరోను కొడుకులు ఆ బాకాలు ఊదాలి. మీ తరతరాల్లో మీ సంతానానికి అది నిత్యమైన నియమంగా ఉండాలి. 
 ౯ మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను. 
 ౧౦ మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.” 
 ౧౧ రెండో సంవత్సరం రెండో నెల ఇరవయ్యో రోజున శాసనాల గుడారం పైనుండి మేఘం వెళ్లి పోయింది.  ౧౨ కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యంలో తమ ప్రయాణం సాగించారు. మేఘం తిరిగి పారాను అరణ్యంలో నిలిచింది.  ౧౩ యెహోవా మోషేకి ఇచ్చిన ఆదేశాలను బట్టి వారు తమ మొదటి ప్రయాణం చేశారు. 
 ౧౪ యూదా గోత్రం వారి ధ్వజం కింద ఉన్న సైన్యం మొదట శిబిరం బయటికి కదిలింది. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను ఆ సైన్యానికి నాయకుడు.  ౧౫ ఇశ్శాఖారు గోత్రం సైన్యాన్ని సూయారు కొడుకు నెతనేలు నడిపించాడు.  ౧౬ జెబూలూను గోత్రం సైన్యానికి హేలోను కొడుకు ఏలీయాబు నాయకుడు. 
 ౧౭ గెర్షోను, మెరారి తెగలవారు తమ బాధ్యత ప్రకారం మందిరాన్ని విప్పి దాన్ని మోస్తూ ముందుకు సాగారు.  ౧౮ తరువాత రూబేను గోత్రం ధ్వజం కింద ఉన్న సైన్యం ముందుకు కదిలింది. ఆ సైన్యానికి నాయకుడు షెదేయూరు కొడుకు ఏలీసూరు.  ౧౯ షిమ్యోను గోత్రం సైన్యానికి సూరీషదాయి కొడుకు షెలుమీయేలు నాయకుడు.  ౨౦ గాదు గోత్రం సైన్యానికి దెయువేలు కొడుకు ఎలీయాసాపు నాయకుడు. 
 ౨౧ కహాతు తెగవారు ప్రయాణమయ్యారు. వారు పరిశుద్ధ స్థలంలోని పరిశుద్ధ పరికరాలను మోస్తూ వెళ్ళారు. తరువాతి శిబిరంలో కహాతు తెగవారు వచ్చేలోగా ఇతరులు మందిరాన్ని నిలబెడుతూ ఉన్నారు.  ౨౨ ఎఫ్రాయీము గోత్రం వారి ధ్వజం కింద వారి సేనలు కదిలాయి. ఈ సైన్యానికి అమీహూదు కొడుకు ఎలీషామా నాయకుడు.  ౨౩ మనష్శే గోత్రం సైన్యానికి పెదాసూరు కొడుకు గమలీయేలు నాయకుడు.  ౨౪ బెన్యామీను గోత్రం సైన్యానికి గిద్యోనీ కొడుకు అబీదాను నాయకుడు. 
 ౨౫ చివర్లో దాను గోత్రపు సైన్యాలు తమ ధ్వజం కింద కదిలాయి. ఈ సైన్యానికి నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజరు.  ౨౬ ఆషేరు గోత్రం సైన్యానికి ఒక్రాను కొడుకు పగీయేలు నాయకుడు.  ౨౭ నఫ్తాలి గోత్రం సేనలకి ఏనాను కొడుకు అహీరా నాయకుడు.  ౨౮ ఈ విధంగా ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు ప్రయాణం చేసాయి. 
 ౨౯ మోషే హోబాబుతో మాట్లాడాడు. ఈ హోబాబు మోషే భార్యకు తండ్రి అయిన రెవూయేలు కొడుకు. ఇతడు మిద్యాను ప్రాంతం వాడు. మోషే హోబాబుతో “యెహోవా మాకు చూపించిన దేశానికి మేము వెళ్తున్నాం. దాన్ని మీకు ఇస్తానని యెహోవా మాకు చెప్పాడు. నువ్వు మాతో రా. మా వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేస్తానని యెహోవా ప్రమాణం చేశాడు” అని చెప్పాడు.  ౩౦ దానికి అతడు “నేను రాను. నేను నా స్వదేశానికీ, నా సొంత ప్రజల దగ్గరకీ వెళ్తాను” అన్నాడు. 
 ౩౧ అప్పుడు మోషే ఇలా జవాబిచ్చాడు. “నువ్వు మమ్మల్ని దయచేసి విడిచి పెట్టవద్దు. అరణ్యంలో ఎలా నివసించాలో నీకు బాగా తెలుసు. నువ్వు మా కోసం కనిపెట్టుకుని ఉండాలి.  ౩౨ నువ్వు మాతో వస్తే యెహోవా మాకు చేసిన మేలుని మేము నీకు చేస్తాం.” 
 ౩౩ వారు యెహోవా కొండ దగ్గర నుండి మూడు రోజులు ప్రయాణం చేశారు. వారి విశ్రాంతి స్థలం కోసం చేసిన మూడు రోజుల ప్రయాణంలో యెహోవా నిబంధన శాసనాల పెట్టె వాళ్లకి ముందుగా కదిలింది.  ౩౪ వారు తాము మజిలీ చేసిన స్థలం నుండి ప్రయాణం చేసినప్పుడు యెహోవా మేఘం పగటివేళ వారి మీద ఉంది. 
 ౩౫ నిబంధన పెట్టె ప్రయాణం కోసం లేచినప్పుడల్లా మోషే “యెహోవా, లే, నీ శత్రువులను చెదరగొట్టు. నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుటనుండి తరిమి కొట్టు” అనేవాడు.  ౩౬ నిబంధన పెట్టె ఆగినప్పుడు మోషే “యెహోవా లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తిరిగి రా” అనేవాడు.